దేశంలో 6జీ నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ దశాబ్దం చివరి నాటికి దీనిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో త్వరలో 5జీ సేవలను ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెట్వర్క్ అమల్లోకి వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థలో మరో 450 బిలియన్ డాలర్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. 5జీ సాంకేతికత.. పాలనావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. 5జీతో కేవలం ఇంటర్నెట్ వేగమే కాదు.. అభివృద్ధి వేగం కూడా పెరుగుతుందన్నారు.

ఉద్యోగాలనూ సృష్టిస్తుందని ప్రధాని వివరించారు. తమ హయాంలో దేశం పారదర్శకంగా 4జీ సేవల దిశగా మళ్లిందని, ఇప్పుడు 5జీకి వెళ్తోందని తెలిపారు. దేశంలో టెలిడెన్సిటీ, ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోందని మోదీ అన్నారు. స్థానికంగా మొబైల్ తయారీ యూనిట్లు రెండు నుంచి 200కి పైగా విస్తరించాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. దేశీయంగా రూపొందించిన ‘5G టెస్ట్ బెడ్’ ను ప్రారంభించారు. రూ.220 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్.. స్థానిక పరిశ్రమలు, స్టార్టప్లకు తోడ్పాటునందిస్తుందని ప్రధాని వివరించారు.